కర్నూలు, జూలై 31(చైతన్యగళం):
ఎమ్మిగనూరు మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అక్రమాలపై స్పందించకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వేటూరి రంగస్వామి డీఈఓ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆసదుల్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ, “ఎమ్మిగనూరు మండల పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలు — లలిత అలియాస్ ప్రతిభ విద్యానికేతన్ యూపీ, మేధా ప్రాక్సిస్ — అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా శాఖలు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ ఎంఈఓ ఆంజనేయులు తగిన తనిఖీలు చేయకుండా, చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు” అని తెలిపారు.
అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలు, రిన్యువల్ లేకుండా కొనసాగుతున్న పాఠశాలలు, విద్యా నియమావళి ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపి ఆరోపణలు నిజమని తేలితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవా నియమాల ప్రకారం ఎమ్మిగనూరు ఎంఈఓపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
