- బీఆర్ఎస్ క్రెడిట్ రాజకీయాలు మానుకోవాలి – కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు
కరీంనగర్, జూలై 29 (చైతన్యగళం):
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది–మేడారం గాయత్రి పంప్హౌస్ల నుంచి సాగునీటిని విడుదల చేస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు క్రెడిట్ రాజకీయాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు తీవ్రంగా విమర్శించారు.బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన, “రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే బాహుబలి మోటార్లను ప్రారంభించి 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నాం. రైతుల పంటలు ఎండిపోకుండా సాగునీటి అవసరాలు సకాలంలో తీర్చేందుకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా చర్యలు చేపడుతోంది. దీనిని తమ పోరాట ఫలితమని బీఆర్ఎస్ ప్రచారం చేయడం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ట” అని అన్నారు.పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రచారానికే పరిమితమైన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ప్రజాహిత నిర్ణయానికీ క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రజలు వాస్తవాలను స్పష్టంగా గుర్తించే స్థితిలో ఉన్నారని రాజేందర్రావు పేర్కొన్నారు. “రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది. ప్రజల సమస్యలను పరిష్కరించడమే మా ధ్యేయం” అని ఆయన స్పష్టం చేశారు.
