- విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం): నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా భల్లెం చంటి నియమితులయ్యారు. ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి మార్గదర్శకత్వంలో ఆయన నియామకం జరిగింది. భల్లెం చంటి నియామకానికి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడు భూక్య ఉమా మురళీ నాయక్, ఎన్ఎస్యూఐ మహబూబాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు పెరుమాండ్ల చరణ్ గౌడ్ తదితరుల సహకారం, మద్దతు, మార్గదర్శకత్వం కీలకమని ఎన్ఎస్యూఐ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా భల్లెం చంటి మాట్లాడుతూ… జిల్లాలో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి బలంగా తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు పోరాడడంతో పాటు ప్రతి కళాశాలలో ఎన్ఎస్యూఐని బలోపేతం చేసి విద్యార్థుల గొంతుకగా నిలుస్తానని తెలిపారు. భల్లెం చంటి నియామకం పట్ల ఎన్ఎస్యూఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
