- పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి: నరేందర్రెడ్డి
సుల్తానాబాద్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నిర్వహించాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించి పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ, పాఠశాలలో వారితో ప్రత్యక్షంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీనివల్ల విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావనతో పాటు సాంస్కృతిక విలువలు పెంపొందుతాయని అన్నారు. అన్ని రంగాల్లో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులు భక్తిగీతాలు, ప్రసంగాలు, పాటలకు అనుగుణంగా నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. వినాయక చవితి పండుగ విశిష్టత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని వివరిస్తూ విద్యార్థులు చేసిన ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
