తిరుమల, సెప్టెంబర్ 3 (చైతన్య గళం):
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెప్టెంబర్ 4న గోకులాష్టమి ఆస్థానం, సెప్టెంబర్ 5న ఉట్లోత్సవం వేడుకలు జరగనున్న నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోగా, వెలుపల కూడా భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని ఉచిత సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కోసం సుమారు 14 గంటలకు పైగా సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 నుంచి 5 గంటల వరకు సమయం పడుతోంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆయా తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు సెప్టెంబర్ 2న తిరుమలలో 72,510 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.4.12 కోట్ల ఆదాయం లభించింది. 31,452 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 3.85 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.18 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.
