హుస్నాబాద్, ఆగస్టు 28 (చైతన్యగళం): రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళా ప్రయాణికులతో ఆత్మీయంగా ముచ్చటించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో పందిళ్ల నుంచి హుస్నాబాద్ బస్స్టేషన్ వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులు మంత్రికి రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వారితో ఆప్యాయంగా మాట్లాడి ప్రయాణ సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు పండుగ రోజున విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను మంత్రి అభినందించారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరేలా సేవలందిస్తున్న సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు మహిళలు సుమారు రూ.12 వేల కోట్ల విలువైన ప్రయాణ సేవలను ఉచితంగా పొందారని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 5 వేల బస్సులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.