కడ్తాల్, జూలై 31 (చైతన్యగళం):
రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ జెడ్పిటిసి, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ స్పష్టం చేశారు.
కడ్తాల్ మండల కేంద్రంలోని హక సెంటర్లో యూరియా బ్యాగులు కొనుగోలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, “దాదాపు 15 రోజుల క్రితం ఆన్లైన్ ద్వారా బుక్ చేసిన యూరియా బ్యాగులు ఈరోజు లభించాయి. కానీ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఈ ఆన్లైన్ విధానం వల్ల ఇబ్బందులు పడుతున్నారు” అని తెలిపారు.
గత కెసిఆర్ ప్రభుత్వంలో ఆన్లైన్ లేకుండా ఆఫ్లైన్ విధానంలోనే రైతులు సులభంగా యూరియా, ఇతర ఎరువులను పొందేవారని, పంట సీజన్ రాకముందే టన్నుల కొద్దిగా నిల్వలు అందుబాటులో ఉండేవని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం కూడా ఆన్లైన్ విధానాన్ని తొలగించి, ఆఫ్లైన్ ద్వారా యూరియా అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
హక సెంటర్ నిర్వాహకుడు నరేష్ నాయక్తో మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రియరమేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ సువాలి పంతు నాయక్, వార్డ్ సభ్యుడు మల్లేష్ నాయక్, రైతులు గోపాల్, సక్రు, నరేష్, రాజు, రాములు, శీను తదితరులు పాల్గొన్నారు.
