- పారదర్శక పరీక్షా వ్యవస్థకు నాంది పలకాలి – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, జూలై 25 (చైతన్యగళం):
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా భారత యువత సాధించిన ఘన విజయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ నిజం, న్యాయం, జవాబుదారీతనం కోసం అలుపెరగకుండా పోరాడిన లక్షలాది మంది విద్యార్థులు, యువత, తల్లిదండ్రుల సంకల్పానికి ఈ పరిణామం నిదర్శనమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం వారి గొంతుకను పార్లమెంట్ లోపల, బయట బలంగా వినిపిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీతనం కోరిన ప్రతిపక్షాల పోరాటం ఫలితంగానే ఈ రాజీనామా జరిగిందని అన్నారు. రాజీనామాతోనే వ్యవహారం ముగిసిపోకూడదని, దేశంలోని ప్రతి విద్యార్థిలో విశ్వాసాన్ని నింపేలా పారదర్శకమైన, విశ్వసనీయమైన, ప్రతిభకు న్యాయం చేసే పరీక్షా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. “యువత న్యాయం కోసం ఏకమైతే… ప్రజాస్వామ్యం తప్పక స్పందిస్తుంది” అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు.
