కరీంనగర్, జూలై 20 (చైతన్యగళం):
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో, ఆగస్టు 1 నుంచి మూడు నెలల బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజులు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం అందించేవారు. అయితే, ఈసారి మూడు నెలల బియ్యం ఒకేసారి ఇవ్వనుండటంతో ఆగస్టు నెలలో మొత్తం 31 రోజులు దుకాణాలు తెరచి బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది.
ప్రతి రేషన్ కార్డుదారు మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వలన ప్రజలకు ముందుగానే తగినంత బియ్యం అందుబాటులో ఉండి, వర్షాభావ పరిస్థితుల్లో ఆహార భద్రతకు ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు.
