సిద్దిపేట, జూలై 18 (చైతన్యగళం):
పెండింగ్లో ఉన్న చెక్బౌన్స్ (ఎన్ఐ యాక్ట్) కేసులను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో శనివారం సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. సుదర్శన్ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఐ–అదనపు జిల్లా న్యాయమూర్తి వై. జయప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి (ఎఫ్ఏసీ) ఎన్. సంతోష్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వై. జయప్రసాద్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా ఎన్ఐ యాక్ట్ కేసులను పరస్పర రాజీతో త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగకుండా ఒకే వేదికపై వివాదాలను ముగించుకోవచ్చని, దీంతో సమయం, ధనం రెండూ ఆదా అవుతాయని తెలిపారు. న్యాయవాదులు, పోలీసులు లోక్ అదాలత్ ప్రాధాన్యతను పార్టీలకు వివరించి ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా సహకరించాలని కోరారు.
స్పెషల్ లోక్ అదాలత్లో భాగంగా జిల్లాలో మొత్తం తొమ్మిది బెంచ్లు ఏర్పాటు చేయగా, 46 ఎన్ఐ యాక్ట్ కేసులు పరిష్కారమై రూ.2,78,61,790 విలువైన క్లెయిమ్లకు రాజీ కుదిరింది.
ఈ కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎ. కుమారస్వామి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి. సాధన, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. తరణి, ద్వితీయ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సౌజన్య, సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రమేష్ బాబు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
