హుస్నాబాద్ జూలై 3 {చైతన్యగళం}:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మరోసారి అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వారం రోజుల క్రితం ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల్లో చోరీలకు పాల్పడిన ఘటన మరవకముందే, ఈసారి పోలీస్ స్టేషన్కు అత్యంత సమీపంలో ఉన్న ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడటం స్థానికుల్లో ఆందోళనకు గురిచేస్తోంది.
అర్ధరాత్రి సమయంలో స్థానిక మార్కండేయ దేవాలయంలోకి చొరబడిన దుండగులు అక్కడ ఉన్న రెండు హుండీలను పగులగొట్టి, భక్తులు సమర్పించిన నగదును అపహరించారు. అనంతరం సమీపంలోని అభయ వీరాంజనేయ స్వామి దేవాలయంలోకి కూడా ప్రవేశించారు. అయితే అక్కడ హుండీ ఖాళీగా ఉండటంతో ఎలాంటి నగదు దొరకక వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
పట్టణ నడిబొడ్డున, పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఉన్న ఆలయాల్లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు, భక్తులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న హుస్నాబాద్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేశారు. ఆలయాలు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇటీవల దుకాణాల్లో జరిగిన చోరీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించిన అనుమానితుడి ముఖకవళికలు, ఆలయ చోరీ ఘటనలో లభ్యమైన ఫుటేజీల్లో కనిపించిన వ్యక్తి ముఖకవళికలతో పోలికలు ఉండటం గమనార్హం. దీంతో ఈ రెండు ఘటనల వెనుక ఒకే ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
