రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా అర్హులైనవారికి కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు.
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి భారీ గుడ్ న్యూస్. పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రకటన జారీ చేసింది. త్వరలోనే అర్హులైనవారికి కొత్తగా రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి రేషన్ కార్డులు అందించే ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పీడీఎస్ వ్యవస్థ నుంచి నుంచి 22.1 కోట్ల మందిని తొలగించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 8.5 కోట్ల మంది రేషన్ కార్డుదారులను రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాయని పేర్కొన్నారు. పీడీఎస్ జాబితా నుంచి అనర్హులైన రేషన్ కార్డుదారులను తొలగించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయని, కేంద్ర ప్రభుత్వం కాదని పేర్కొన్నారు.
రేషన్ కార్డుల తొలగింపు
దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నవారిలో 8.5 కోట్ల మంది అనర్హులు ఉన్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ గుర్తించింది. వీరిలో మరణించినవారితో పాటు పన్ను చెల్లింపుదారులు, కార్ కలిగి ఉన్నవారు ఉన్నారు. ఈ జాబితాను పరిశీలించాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్ర అధికారులు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పంపిన జాబితా నుంచి 2.21 కోట్ల పేర్లను తొలగించాయని కేంద్ర మంత్రి తెలిపారు. అంతేకాకుండా అర్హులైన లబ్ధిదారులను చేర్చే ప్రక్రియను రాష్ట్రాలు ప్రారంభించాయన్నారు. దీంతో రాష్ట్రాలు దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల అదనపు రేషన్ కార్డులను జారీ చేయనున్నాయని తెలిపారు. పీడీఎస్ జాబితా నుంచి రేషన్ కార్డుదారులను తొలగించే ప్రక్రియ అన్నిచోట్ల ఏకరీతిగా జరగలేదని కూడా కేంద్ర మంత్రి తెలిపారు. కొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయనుండగా.. మరికొన్ని రాష్ట్రాలు అనర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తూనే ఉన్నాయని చెప్పారు.
దేశంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయంటే..?
దేశంలో సుమారు 79 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు పీడీఎస్ పథకం కింద 98.5 శాతం అర్హులైన లబ్ధిదారులకు సేవలు అందించామని తెలిపారు. ఈ పథకం కింద ఆధార్, ఇ-పీఓఎస్ యంత్రాల ద్వారా ధృవీకరణ అనంతరం ప్రయోజనాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
