నందికొట్కూరు, జూలై 16 (చైతన్యగళం): వ్యవసాయ శాఖలో పన్నెండేళ్లుగా పనిచేస్తున్నా నెలకు రూ.12 వేల జీతం, రూ.3 వేల ఇన్సెంటివ్ మాత్రమే అందుతున్నారని బహుళ ప్రయోజన వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నాయకులు వాపోయారు. నాలుగు నెలలుగా జీతాలు అందక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.ఈ నెల 20 నుంచి 25 వరకు సహాయ నిరాకరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘సమాన పనికి సమాన వేతనం’ కింద నెలకు రూ.35 వేల జీతం అమలు చేయాలని, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, నాన్ శాంక్షన్ పోస్టులను శాంక్షన్ పోస్టులుగా మార్చాలని, ఎంప్లాయ్ హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, విధి నిర్వహణలో మరణించిన వారికి ఎక్స్రేషియా ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రులు, ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాముడు, సలామ్ బాష, విష్ణు, సుధాకర్, వేణు బాయ్, జాన్సీ, దాసు, అఖిల్, జాబిహుళ్ల, షహనాజ్, అమృత తదితరులు పాల్గొన్నారు.
