- గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టంపై అవగాహన
ఆమనగల్లు, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): విద్యార్థులు తమ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని షీ టీం కానిస్టేబుల్ జ్యోతి సూచించారు. శుక్రవారం పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ ఇర్విన్ పాఠశాలలో షీ టీం ఇన్చార్జి జగదీశ్వర్ ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, బాలల భద్రత, మహిళలు, బాలికల రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. చిన్నారులు ఎదుర్కొనే వేధింపులు, అసభ్య ప్రవర్తన, అనుచిత స్పర్శ వంటి అంశాలపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. తమకు అసౌకర్యం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. తమపై జరిగే వేధింపులను దాచిపెట్టకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్ చేయవచ్చని, సహాయం కోసం 8712671000 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. సైబర్ నేరాల పట్ల కూడా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్వర్డ్లు పంచుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్వతాలు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
