రాత్రంతా నగరంలో చక్కర్లు.. ఎల్కతుర్తి వద్ద ప్రమాదం
కరీంనగర్, సెప్టెంబర్ 8(చైతన్యగళం):
జిల్లాలో వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్ నుంచే పెట్రోలింగ్ వాహనం చోరీకి గురైన ఘటన కలకలం రేపుతోంది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన పెట్రోలింగ్ ఇన్నోవా కారును అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
వాహనాన్ని చోరీ చేసిన అనంతరం నిందితుడు రాత్రంతా నగరంలో తిరిగినట్లు తెలుస్తోంది. అనంతరం తెల్లవారుజామున వరంగల్ వైపు వెళ్తుండగా ఎల్కతుర్తి సమీపంలో ఇన్నోవా ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇన్నోవాను సిటీ పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించినట్లు సమాచారం. అయితే వాహనం చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
పోలీస్ స్టేషన్ నుంచే పెట్రోలింగ్ వాహనం చోరీకి గురికావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
