నల్లగొండ ,ఆగస్టు 15( చైతన్యగళం):
నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య భవన్లో కి పోలీసులు గుండాల్లాగా ప్రవేశించి సిపిఐఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మహమ్మద్ సలీం పుచ్చకాయల నర్సిరెడ్డి దండంపెల్లి సత్తయ్య అవుట రవీందర్ బొల్లు రవీందర్ ల పై దాడి చేసి గుర్రంపూడ్ పోలీస్ స్టేషన్లో బంధించడాన్ని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశమ్, మండల కార్యదర్శి నలపరాజు సైదులు ఖండించారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో పోలీసులు స్వాతంత్రం వచ్చిన రోజునే ఆఫీసులపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు ఆఫీసులో ప్రవర్తించిన తీరును చూస్తే విస్మయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ప్రజా నాయకుల పై దాడి చేయడం సరైనది కాదు అని విమర్శించారు. నార్కట్ పల్లి ఎస్సైగా ఉన్న విష్ణు కి గతంలో చెప్పాము ఇప్పుడు కూడా చెబుతున్నాం మీరూ వ్యవహరించిన తీరు బాగాలేదు ఇలా ఉంటే మీరు ఉద్యోగంలో భవిష్యత్తులో కొనసాగలేరని, మీరు ఆవేశం తగ్గించుకోవాలని ప్రజల పట్ల ప్రజానాయకుల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరారు. పోలీసులంటే ప్రజలకు రక్షణగా ఉండాలి తప్ప పోలీసులను చూస్తే ప్రజలు ఈసడించుకునే పరిస్థితి రావద్దని అన్నారు. అరెస్టు చేసిన సిపిఐ ఎం నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
