- ఎల్లమ్మ దేవాలయంలో బోనం సమర్పించిన విద్యార్థులు.. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు
వెల్దండ, ఆగస్టు 10 (చైతన్యగళం): వెల్దండ మండల పరిధిలోని గుండాల గ్రామంలో ఉన్న ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ సుమన్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బోనాల పండుగ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గుండాల గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయానికి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పాఠశాల, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రార్థించారు. సంప్రదాయ ఆచారాలతో నిర్వహించిన ఈ వేడుకలతో పాఠశాల పరిసరాల్లో పండుగ సందడి నెలకొంది.

విద్యార్థుల్లో మన సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు వాటి విశిష్టతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల వర్గాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కోడెం భాస్కర్, ఉపాధ్యాయులు అనీషా, ధర్మేందర్, అనూష, మల్లికతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
