CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 10:40 pm Posted by : rakeshkashaveni12@gmail.com

గౌరవెల్లి కాలువల భూసేకరణ వేగవంతం

సెప్టెంబర్‌ 15లోగా రైతులకు పరిహారం చెల్లించాలి

హుస్నాబాద్, ఆగస్టు 31 (చైతన్యగళం):

గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసిందని, నిధులను సద్వినియోగం చేసుకుంటూ కాలువల భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులతో సమావేశమైన మంత్రి గౌరవెల్లి ప్రాజెక్టు ప్రధాన ఎడమ, కుడి కాలువల భూసేకరణ, నిర్మాణ పనులపై సమీక్షించారు కాలువల నిర్మాణానికి 559 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటికే 416 ఎకరాలకు అవార్డు ప్రక్రియ పూర్తయిందని మంత్రి తెలిపారు. అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాల పరిధిలోని రైతులకు సెప్టెంబర్‌ 15లోగా నష్టపరిహారం చెక్కులు అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకొని పరిహారం చెల్లింపును వేగవంతం చేయాలని సూచించారు. మిగిలిన 143 ఎకరాల భూసేకరణను 90 రోజుల్లోగా పూర్తి చేసి కాలువల నిర్మాణ పనులు త్వరగా హుస్నాబాద్ ప్రాంత రైతుల చిరకాల వాంఛ అయిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తిచేస్తామని తెలిపారు అలాగే చౌటపల్లి పారిశ్రామిక పార్కు భూసేకరణ, తంగళ్లపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా సమీకృత వసతి పాఠశాల, శాతవాహన విశ్వవిద్యాలయంలో అదనపు భవన నిర్మాణం, హుస్నాబాద్‌లో 250 పడకల ఆసుపత్రి, హుస్నాబాద్–కొత్తపల్లి రహదారి, న్యాక్‌ కేంద్రం, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, అటవీ–పట్టణ అభివృద్ధి పార్కు, వనమహోత్సవం తదితర అభివృద్ధి పనులపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు సమావేశంలో జిల్లా కలెక్టర్‌ కె. హైమావతి, అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి, నీటిపారుదల శాఖ సీఈ సత్యనారాయణరెడ్డి, హుస్నాబాద్‌ ఆర్డీఓ రామ్మూర్తి, హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.