హుజురాబాద్ , ఆగస్టు 27 (చైతన్య గళం): జాతీయ రహదారిని ఆనుకుని చెత్తను డంప్ చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి హుజురాబాద్ మండలం సిర్సపల్లి సమీపంలో 563వ జాతీయ రహదారి పక్కన ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డును ఆమె పరిశీలించారు జాతీయ రహదారికి ఆనుకుని డంపింగ్ యార్డు ఉండటంపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కలెక్టర్ అక్కడి పరిస్థితులను పరిశీలించారు. రహదారికి సమీపంలో కొంత దూరం వరకు చెత్త వేయడం నిలిపివేసి, ఆ తర్వాతి ప్రాంతంలోనే చెత్తను డంప్ చేయాలని సూచించారు. రహదారి వెంబడి ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు హుజురాబాద్ పట్టణంలోని వివిధ డివిజన్ల నుంచి సేకరించిన చెత్తను తరలించే వాహనాలు జాతీయ రహదారి మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో డంపింగ్ యార్డుకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రహదారిపై చెత్త సేకరణ వాహనాల రాకపోకలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి డంపింగ్ యార్డు పరిసరాల్లో పరిశుభ్రత, పచ్చదనం ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీవో జలకుమారి, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, తహసీల్దార్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.