కరీంనగర్, ఆగస్టు 4{చైతన్యగళం}:
హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన కార్పెంటర్ రాజ్కుమార్ విద్యుత్ ప్రమాదంలో రెండు కాళ్లు, ఒక చేయి కోల్పోయి కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీసులు మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. మూడు నెలల క్రితం గన్ముకుల గ్రామంలో ఓ ఇంటికి పెయింటింగ్ పనులు చేస్తుండగా సమీపంలోని 11 కేవీ విద్యుత్ లైన్ తగలడంతో రాజ్కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధిత కుటుంబ పరిస్థితిని గుర్తించిన వీణవంక రూరల్ సీఐ పులి వెంకట్, ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి మంగళవారం రాజ్కుమార్ ఇద్దరు కుమార్తెల పేరుపై రూ.60 వేల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ డిపాజిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్థికంగా స్థోమత ఉన్న దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి కుటుంబానికి చేయూతనివ్వాలని కోరారు. కార్యక్రమంలో కేశపట్నం ఎస్ఐ శేఖర్రెడ్డి, ఇల్లంతకుంట ఎస్ఐ క్రాంతికుమార్, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు. పోలీసుల సేవాభావాన్ని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
