- ప్రజల కోసం మా పోరాటం ఆగదు: సిరికొండ బలరాం
ములుగు , సెప్టెంబర్ 1(చైతన్యగళం): బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ విద్యార్థులు, రైతులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతోందన్నారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న నాయకులు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలు, ఇళ్లపై దాడులకు పాల్పడటం అమానుషమని మండిపడ్డారు. “దాడులతో బీజేపీని భయపెట్టలేరు.. ప్రజల కోసం మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు” అని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బలరాం విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీజేపీపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. మహిళలు, విద్యార్థులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించాలని డిమాండ్ చేశారు.రానున్న ఎన్నికల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్ శ్రేణులు అసహనంతో దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. “అధికారం శాశ్వతం కాదు. దాడులతో బీజేపీని ఆపలేరు” అని అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజ్మీరా కృష్ణవేణి నాయక్, భూక్యా జవహర్ లాల్, ఎస్.టి. పాలసీ రీసెర్చ్ కో-కన్వీనర్ గుగులోత్ స్వరూప, జిల్లా ఉపాధ్యక్షులు జినుకల కృష్ణాకర్ రావు, అల్లె శోభన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కొర్ర సుమలత, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు జనార్ధన్, జిల్లా నాయకులు గాదం కుమార్, ఎల్కతుర్తి శ్రీహరి, ములుగు మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు, మల్లంపల్లి మండల అధ్యక్షులు బైకాని మహేందర్, పట్టణ అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి లకావత్ రాజ్ కుమార్, నాయకులు రెడ్డి శ్రీనివాస్, యాద సంపత్, మచ్చ రవి, బండి బాబు, మహిళా మోర్చా నాయకురాలు అనూష రజిత, బీజేవైఎం నాయకులు అనిల్, మమన్, సాయి, జశ్వంత్, బండి రవీందర్, సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.