CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 9:03 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ, ఆగస్టు 1 (చైతన్యగళం):
నల్గొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం పరిశీలించారు.మొదటగా పెద్ద సూరారం గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులను సమీక్షించి, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మంత్రి మాట్లాడుతూ, “గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.20,000 కోట్లతో ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి” అని తెలిపారు.పెద్ద సూరారం గ్రామానికి సబ్‌స్టేషన్ మంజూరు చేసినట్లు వెల్లడిస్తూ, సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసి మూడు నుంచి నాలుగు నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.

గ్రామంలో రూ.60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, ఆగస్టు 15న మహిళా సంఘాలకు రూ.2.5 కోట్ల రుణాల చెక్కులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న పరిశ్రమలు, రైస్ మిల్లుల వంటి ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.చందంపల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, చెత్త తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.పజ్జూరు గ్రామ అభివృద్ధి పనులను పరిశీలించి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను నాణ్యతతో, జాప్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఎర్రగడ్డగూడెం గ్రామ రచ్చబండ వద్ద ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.