హైదరాబాద్, జూలై 2 (నీలగిరి ఎక్స్ప్రెస్):
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు మధ్యాహ్న భోజనం అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీపీటీఎఫ్ ఆహ్వానించింది.
రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి సంయుక్త ప్రకటనలో మాట్లాడుతూ, “ఈ నిర్ణయం వల్ల పర్యవేక్షణ పెరుగుతుంది, జవాబుదారీతనం బలోపేతం అవుతుంది. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందుతుంది. అందరం సమానమనే భావన కలుగుతుంది” అని పేర్కొన్నారు.
అయితే, మధ్యాహ్న భోజన వర్కర్ల జీతాలు, సరుకుల ధరలు మార్కెట్ రేట్లకు అనుగుణంగా పెంచితేనే మంచి భోజనం అందించగలరని ప్రభుత్వం గ్రహించి అమలు చేయాలని సూచించారు.
అదేవిధంగా, “భోజనం అందించడం ఓకే, కానీ అత్యంత ముఖ్యమైనది నాణ్యమైన విద్య అందించడమే. దీనికోసం రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలి” అని టీపీటీఎఫ్ కోరింది.
టీపీటీఎఫ్ మరో కీలక సూచన చేసింది: “రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పిల్లలు కూడా నైబర్హుడ్ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలనే కేబినెట్ నిర్ణయం తీసుకుంటే, తెలంగాణ దేశంలో నెంబర్ వన్ అవుతుంది” అని పేర్కొంది.
