CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 12:00 pm Posted by : CHAITHANYA GALAM NEWS

నువ్వు ఒంటరి అయిపోతావ్.. నెతన్యాహుకు ట్రంప్ వార్నింగ్

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల చెలరేగిన ఉద్రిక్తతలు అమెరికా జోక్యంతో సద్దుమణిగిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై దాడులను కట్టిపెట్టాలని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తాను స్పష్టం చేశానని సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించానని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

‘నేను బీబీని (నెత్యన్యాహు) హెచ్చరించా.. తన చర్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నా. మాట వినకపోతే చివరకు ఒంటరిగానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించా’ అని ట్రంప్ మీడియాకు చెప్పారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు హద్దుదాటకుండా అడ్డుకున్నానని కూడా చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తేవాలని తనను ఐదు దేశాలు కోరడంతో ఆయనకు ఫోన్ చేశానని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌పై దాడుల గురించి ఆదివారం రాత్రి బీబీ తనకు చెప్పారని అన్నారు. అప్పటికే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ వైపు వెళ్లిపోయాయని చెప్పారు.

ట్రంప్ ప్రకటనకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. ఇరాన్ దాడుల నుంచి తనని తాను కాపాడుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని అని స్పష్టం చేశారు. ఇరాన్ మళ్లీ దాడులు చేస్తే ఈసారి పూర్తిశక్తితో ప్రతిస్పందించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు.

లెబనాన్‌పై దాడులకు నిరసనగా ఇరాన్ శనివారం ఇజ్రాయెల్‌పై మిసైల్స్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. బదులుగా ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులు చేసింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో అమెరికా జోక్యం చేసుకుని ఘర్షణలు తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసింది.