CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 9:16 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కల్వకుర్తిని స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం – సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి, జూన్ 17 (చైతన్యగళం):
గ్రామీణ యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ మరో కీలక ముందడుగు వేసింది. భవిష్యత్ ఉద్యోగ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్న కృత్రిమ మేధస్సు , సమాచార సాంకేతికత రంగాల్లో కల్వకుర్తి యువతను తీర్చిదిద్దేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఇండోఫాంట్ గ్లోబల్ ఐఎన్సీ‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నాయకత్వం వహించారు.

ఆయన మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లలో కనీసం 5,000 మంది యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఏఐ , ఐటీ, డేటా అనలిటిక్స్, డిజిటల్ టెక్నాలజీస్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదవలేదని, అయితే సరైన శిక్షణ, మార్గదర్శకత్వం, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన అవకాశాల లేమితో అనేక మంది యువత వెనుకబడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను తీసుకువస్తున్నామని తెలిపారు.సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, డిజిటల్ టూల్స్ వినియోగం, ఫ్రీలాన్సింగ్, రిమోట్ వర్క్ అవకాశాలు, స్టార్టప్‌లు, స్వయం ఉపాధి, కెరీర్ గైడెన్స్ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.

“ప్రస్తుత డిజిటల్ యుగంలో ఒక గ్రామంలో ఉన్న యువకుడు కూడా ప్రపంచంలోని ప్రముఖ సంస్థలకు సేవలు అందించే స్థాయికి ఎదగగలడు. సరైన నైపుణ్యాలు ఉంటే అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలను సాధించవచ్చు” అని రాఘవేందర్ రెడ్డి అన్నారు.ఇప్పటికే ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రాలు, స్టడీ మెటీరియల్ పంపిణీ, కెరీర్ మార్గదర్శక కార్యక్రమాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు.

భవిష్యత్ తరాలకు అత్యంత అవసరమైన టెక్నాలజీ ఆధారిత నైపుణ్యాలను అందించడం ద్వారా కల్వకుర్తిని *“స్కిల్ అండ్ టెక్నాలజీ హబ్”*గా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఇండోఫాంట్ గ్లోబల్ ఐఎన్సి వ్యవస్థాపకుడు, సీఈఓ ఎం. మల్లారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు తమ సంస్థ ఐక్యత ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ యువతకు చేరవేయడం ద్వారా వారి భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు ఇండోఫాంట్ గ్లోబల్ ఐఎన్ ప్రతినిధుల బృందం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.