ఒకేరోజు 80 వాహనాలు సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు
కరీంనగర్, జూన్ 19 (చైతన్యగళం): నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి నంబర్ ప్లేట్లు లేని 80 వాహనాలను ఒకేరోజు సీజ్ చేశారు.
ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు సంజీవ్, అంజయ్యలు సిబ్బందితో కలిసి ప్రధాన చౌరస్తాల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేకుండా, లేదా స్పష్టంగా కనిపించని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఏసీపీ మాట్లాడుతూ, “ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరి. నంబర్ ప్లేట్లు లేకుండా నేరస్థులు తప్పించుకునే అవకాశం ఉంటుంది” అని హెచ్చరించారు. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు మాత్రమే అమర్చాలని, పిచ్చిరాతలు లేదా ట్యాంపరింగ్ చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
పట్టుబడిన వాహనాలను సరైన పత్రాలు సమర్పించి, నంబర్ ప్లేట్ అమర్చిన తర్వాతే విడుదల చేస్తామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.