CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 2:45 pm Posted by : CHAITHANYA GALAM NEWS

బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశం

నంద్యాల, జూన్ 16 ( చైతన్య గళం): నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ మంగళవారం నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీ అక్కడ ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.స్టేషన్ సిబ్బంది ప్రవర్తన, ఫిర్యాదులపై స్పందన, కేసుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి తక్షణమే స్పందించి న్యాయం చేయడమే మా ప్రథమ ప్రాధాన్యత. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.అనంతరం పెండింగ్‌లో ఉన్న కేసులపై అధికారులతో చర్చించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.ఈ తనిఖీలో స్టేషన్ అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.