CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 3:41 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఊరట

పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు.. బండి భగీరథ్‌కు మేడ్చల్–మల్కాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్, జూన్ 20, (చైతన్యగళం): పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు  బండి భగీరథ్‌కు మేడ్చల్–మల్కాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ వరకు వారంపాటు మధ్యంతర బెయిల్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే షరతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

పోక్సో చట్టం కింద నమోదైన కేసులో భగీరథ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16వ తేదీన అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇంజినీరింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేసిన వాదనలను పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు వారంపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు భగీరథ్ ఈరోజు(శనివారం) మధ్యాహ్నం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు.

ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం మేడ్చల్ – మల్కాజిగిరి కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌తో భగీరథ్ తన విద్యా కార్యక్రమాలను కొనసాగించనున్నారు.