CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 8:54 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ముందస్తు ప్రణాళికతో ఖరీఫ్‌కు సన్నద్ధం కావాలి – జిల్లా కలెక్టర్

కరీంనగర్, జూన్ 17 (చైతన్యగళం): జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆధ్వర్యంలో వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన శాఖలపై సమీక్షా సమావేశం జరిగింది.

కలెక్టర్ మాట్లాడుతూ, “వాతావరణ మార్పుల సవాళ్లను తట్టుకుని రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించి, నికర ఆదాయాన్ని పెంచేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలి” అని సూచించారు.

తృణధాన్యాలు, నూనెగింజలు, పత్తి సాగు పెంచాలని, మొక్కజొన్న ఉత్పత్తి పరిశ్రమలను జిల్లాలో ప్రోత్సహించాలని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచి, రైతులకు వాతావరణ అంచనాలు తెలియజేయాలని, యాప్ ద్వారా ఎరువుల బుకింగ్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, ఉద్యానవన పథకాలను గ్రామాల వారీగా వివరించాలని, విజయవంతమైన రైతుల గాధలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. చేప పిల్లల విత్తనాల విడుదల, పశు సంపద అభివృద్ధి, పశువుల ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఉద్యానవన అధికారి జగన్మోహన్ రెడ్డి, మత్స్య అధికారి విజయభారతి, పశుసంవర్ధక అధికారి లింగారెడ్డి, మార్క్ఫెడ్ డీఎం గౌరీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.