CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 11:39 am Posted by : CHAITHANYA GALAM NEWS

పారిశుద్ధ్యంపై ఆకస్మిక తనిఖీలు చేసిన మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్

షాద్‌నగర్, జూన్ 15 (చైతన్యగళం): వర్షాకాలంలో పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం తెల్లవారు జామున 4:30 గంటలకే ఆయన స్వయంగా రంగంలోకి దిగుతూ ఫరూక్‌నగర్, షాద్‌నగర్ పరిధిలోని పలు కాలనీలను సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.వర్షాకాలం నేపథ్యంలో మురుగునీటి పారుదల సక్రమంగా జరిగేలా చూడాలని, డ్రైనేజీల్లో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని పరిశుద్ధ కార్మికులకు సూచించారు. ఈ వర్షాకాలం మొత్తం పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆయన ఆదేశించారు.పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఇతర అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రతి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు కూడా చెత్తను డ్రైనేజీల్లో వేయకుండా మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.కీర్తి వెంచర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి త్వరలోనే పూర్తిస్థాయి పనులు చేపడతామని చైర్మన్ బసవేశ్వర్ తెలిపారు. తెల్లవారుజామున నిర్వహించిన ఆకస్మిక తనిఖీల సందర్భంగా ఆయన పరిశుద్ధ కార్మికులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని పేర్కొన్నారు.