CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 8:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మందమర్రిలో వర్షనష్ట ప్రాంతాలు పరిశీలించిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాల, జూన్ 14 (చైతన్యగళం):
మందమర్రి పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెట్లు విరిగి పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కలిసి నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. దీపక్ నగర్, పాలచెట్టు, 2వ జోన్‌లో కాంగ్రెస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ నివాసం వద్ద జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అలాగే సరస్వతి స్కూల్‌పై చెట్లు పడటంతో దెబ్బతిన్న భవన భాగాలను సమీక్షించారు.

బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన మంత్రి, విరిగిపడిన చెట్లను తొలగించి ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఆదివారం మంచిర్యాల పట్టణంలో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఉదయం హైటెక్ సిటీలోని బ్యాడ్మింటన్ కోర్టులో యువతతో కలిసి బ్యాడ్మింటన్ ఆడి క్రీడల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం మంచిర్యాల బాయ్స్ గ్రౌండ్‌ను సందర్శించి చిన్నారులతో క్రికెట్ ఆడారు. మైదానం అభివృద్ధికి వెంటనే స్పందించిన ఎంపీ, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడి 20 ట్రిప్పుల మట్టిని ఏర్పాటు చేయాలని సూచించారు. చిన్నారుల క్రీడా ప్రోత్సాహం కోసం రెండు క్రికెట్ కిట్లను అందజేస్తానని హామీ ఇచ్చారు.తదుపరి మార్కెట్ ప్రాంతంలోని రత్నలాల్ హోటల్ వద్ద స్థానిక వ్యాపారులు, ప్రజలతో సమావేశమై డ్రైనేజీ, రోడ్లు, పార్కింగ్, తాగునీటి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. వాణిజ్య అవసరాలకు గ్యాస్ సరఫరా పరిస్థితిని కూడా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, “ప్రజల సమస్యలే నా సమస్యలు. ప్రజల్లోనే ఉంటూ వారి అవసరాలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడం నా బాధ్యత” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత, క్రీడాకారులు, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.