కరీంనగర్ రూరల్, జూన్ 14 (చైతన్యగళం):కరీంనగర్ మండలంలోని బావుపేట రోడ్డుపై చిన్నపాటి వర్షం పడినా నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న పరిస్థితిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా గమనించారు.
సిరిసిల్లకు వెళ్తూ రోడ్డుపై నీరు నిలిచిన చోట వాహనం ఆపి స్థానికులతో మాట్లాడిన ఆయన, గతంలోనూ ఇదే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
వర్షాకాలం మొదలైన నేపథ్యంలో స్కూళ్లు తెరుచుకున్న తర్వాత ఆటోలు, బైక్లు తీవ్ర ఇబ్బందులు పడతాయని స్థానికులు చెప్పడంతో, వెంటనే మంత్రి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి శాశ్వత పరిష్కారం చూపాలని, తాత్కాలికంగా నీరు నిలవకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీద బావుపేట చేరుకుని రోడ్డుపై నిలిచిన నీటిని మళ్లించే పనులు ప్రారంభించారు.