CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 9:11 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వనదుర్గమ్మ సన్నిధిలో ఘనంగా కంఠారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు

కార్యకర్తలకు అండగా ఉంటా – ప్రజాసేవయే నా లక్ష్యం అని స్పష్టం.

మెదక్, జూన్ 10 (చైతన్యగళం):మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్, బీఆర్‌ఎస్ పార్టీ గులాబీ వీరుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి 58వ జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.

ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని మాత సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాలు సమర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పలువురు పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

మెదక్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించగా, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం కార్యాలయం నుంచి ఏడుపాయల వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించబడింది.

ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఎలాంటి హోదా లేకుండానే ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు, కార్యకర్తల అండ తనకు బలాన్నిస్తున్నాయని పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నాయని, తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాడతానని స్పష్టం చేశారు.

“అమ్మవారి సాక్షిగా చెబుతున్నాను, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు మెదక్ నియోజకవర్గాన్ని విడిచిపెట్టను. ప్రజాసేవే నా లక్ష్యం” అని ఆయన స్పష్టంగా ప్రకటించారు.

ఈ వేడుకల్లో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మాజీ ఏడుపాయల దేవస్థానం చైర్మన్ బాలగౌడ్, బీఆర్‌ఎస్‌వి నాయకులు నవీన్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.