CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 7:48 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం సమావేశం

ఢిల్లీ, జూన్ 15 (చైతన్యగళం): జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  అధ్యక్షతన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత’ సమావేశం ఢిల్లీలో ఈరోజు(సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో మొత్తం ఐదు కీలక తీర్మానాలని ఆమోదించారు. పార్టీ సిద్ధాంతాలు, దేశ అభివృద్ధి దృష్టికోణం, ప్రజాస్వామ్య విలువలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో ‘వికసిత్ భారత్ – ఆకాంక్షల నుంచి విజయాల వైపు’ అనే తీర్మానాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ తీర్మానం ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత 12 ఏళ్ల సుపరిపాలనను ప్రశంసిస్తూ, ఈ కాలాన్ని దేశ ప్రజాస్వామ్య వికాసంలో ఒక కీలక అధ్యాయంగా పేర్కొన్నారు. జనసేన పార్టీ ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తుందని మొదటి తీర్మానంలో స్పష్టం చేశారు. దేశ సమగ్రత, ఐక్యత, జాతీయ దృక్పథం, ప్రతి పౌరునికి సమాన న్యాయం వంటి విలువలపై పార్టీకి అచంచలమైన నిబద్ధత ఉందని పేర్కొన్నారు. కులం, మతం, భాష, ప్రాంతాలకు అతీతంగా భారతదేశ వైవిధ్యంలో ఏకత్వమే దేశ బలమని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.

మూడో తీర్మానంగా ‘సంక్షోభం నుంచి నమ్మకం వైపు – ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి’ అనే అంశాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర అభివృద్ధి, పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలపై పార్టీ భవిష్యత్తు దిశను ఈ తీర్మానం వివరించింది.

నాలుగో తీర్మానంగా ‘జనసేన పుష్కర కాల ప్రస్థానం – త్యాగం, సేవ, ప్రజల నమ్మకం’ అనే అంశాన్ని ఆమోదించారు. సామాజిక మార్పు, నైతిక రాజకీయాలు, సమాన అభివృద్ధి లక్ష్యాలతో ప్రారంభమైన జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

మొత్తం ఐదు తీర్మానాల ద్వారా జనసేన పార్టీ తన రాజకీయ సిద్ధాంతాలను, అభివృద్ధి దృక్పథాన్ని, దేశ సమైక్యతపై నిబద్ధతను మరింత స్పష్టంగా ప్రకటించినట్లు సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశం పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు దిశానిర్దేశం చేస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.