కరీంనగర్, జూన్ 17 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు.కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం జరిగింది. ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్వోలు తమ పరిధిలోని కేసుల పురోగతిని వివరించారు.
సీపీ మాట్లాడుతూ, “మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి. షీ టీమ్స్, బ్లూ కోల్ట్స్ ద్వారా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించాలి” అని స్పష్టం చేశారు.విజిబుల్ పోలీసింగ్ కోసం రాత్రి–పగలు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై నిఘా ఉంచాలని ఆదేశించారు.
విద్యాసంస్థల సమీపంలో పాన్ షాపులు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేసి మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.నేపాలీ కార్మికుల వివరాలు పోలీస్ స్టేషన్ల వారీగా తప్పనిసరిగా నమోదు చేయాలని, హోటళ్లు–లాడ్జీలలో గుర్తింపు కార్డులు, ఫోన్ నంబర్లు సరిచూసి గదులు ఇవ్వాలని హెచ్చరించారు.
బ్యాంకులు, జ్యువెలరీ షాపుల్లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు.ట్రాఫిక్ నియంత్రణలో నంబర్ ప్లేట్ లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్, టింటెడ్ గ్లాస్, డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటు, పాత కెమెరాల జియో-ట్యాగింగ్పై దృష్టి పెట్టాలని, జూన్ 20న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సీపీ గౌష్ ఆలం ఆదేశించారు.ఈ సమావేశంలో ఏసీపీలు శ్రీనివాస్ జి, విజయకుమార్, వెంకటస్వామి, యాదగిరిస్వామి, మాధవి, ప్రతాప్ తదితర అధికారులు పాల్గొన్నారు.