హైదరాబాద్, జూన్ 14 (చైతన్యగళం): తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ పాఠశాలలు విద్యా కేంద్రాలుగా కాకుండా లాభార్జన సంస్థలుగా మారాయని పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ నరేష్ దండు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.పిల్లల భవిష్యత్తు బాటలు వేయాల్సిన పాఠశాలలు సంపాదనే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాయి. చదువును పక్కన పెట్టి ఏటా 20–30 శాతం ఫీజులు పెంచుతూ బ్రాండ్ క్రియేట్ చేసి ఖజానా నింపుకోవడమే లక్ష్యం అని ఆయన మండిపడ్డారు.తల్లిదండ్రులు పిల్లల చదువుపై శ్రద్ధ పెట్టాలని కోరితే, యాజమాన్యాలు “ఇంట్లో ఇద్దరే ఉంటే చదివించుకోలేరా?” అని ఎదురు ప్రశ్నలు వేస్తున్న ఉదంతాలను ఆయన వివరించారు. కొన్ని స్కూళ్లలో నాలుగో తరగతి ఫీజు రూ.1.20 లక్షలు, ఆరో తరగతి ఫీజు రూ.1 లక్ష వరకు వసూలు చేస్తున్నారని, పైగా ట్యూషన్ కోసం నెలకు రూ.3 వేల అదనంగా వసూలు చేస్తున్నారని ఆయన ఉదాహరణలు చూపించారు.
గుర్తింపు లేని బడులు
రాష్ట్రంలో దాదాపు 500 ప్రైవేట్ స్కూళ్లు గుర్తింపు లేకుండా నడుస్తున్నాయని, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇవి ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనిఖీల్లో బోగస్ సర్టిఫికెట్లు, రిజిస్టర్లలో తారుమారులు బయటపడినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.“విద్య హక్కు కాదు, వ్యాపార వస్తువుగా మారింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గుర్తింపు లేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో వేలాది పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది” అని నరేష్ దండు హెచ్చరించారు.