CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 1:37 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కార్డన్ అండ్ సెర్చ్

నందికొట్కూరు, జూన్ 13 (చైతన్యగళం):నంద్యాల జిల్లాను మాదకద్రవ్యాల నియంత్రణ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు నిరంతర చర్యలు కొనసాగిస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయ పర్యవేక్షణలో, జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలో సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో విస్తృతమైన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలోని అనుమానాస్పద గృహాలు, వాణిజ్య సంస్థల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

కార్డన్ అండ్ సెర్చ్
కార్డన్ అండ్ సెర్చ్

తనిఖీల అనంతరం యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ, “మాదకద్రవ్యాల దుర్వినియోగం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుని చట్టపరమైన ఇబ్బందుల్లో పడతారు” అని హెచ్చరించారు.

గ్రామస్థులు సామూహికంగా మాదకద్రవ్య వ్యతిరేక ప్రతిజ్ఞ చేసి, హానికరమైన మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, పోలీసులకు సహకరిస్తామని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని గంభీరంగా తీర్మానించారు.

ప్రస్తుతం తంగడంచ గ్రామం ప్రశాంతంగా ఉందని, నిరంతరం పోలీసుల నిశిత పర్యవేక్షణలో ఉంటుందని అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.