సైదాపూర్, సెప్టెంబర్ 20(చైతన్యగళం):
గర్రెపల్లి రోడ్డుపై అనుమతి లేకుండా చెట్లు నరికివేసిన ఘటనపై గ్రామపంచాయతీ కార్యదర్శి ఊస కోయిల రాజీవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెట్లను నరికివేసి తరలించేందుకు ఉపయోగించిన ట్రాక్టర్ను అధికారులు సీజ్ చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెట్ల నరికివేతకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
కాగా, కరోనా సమయంలో ఈ రహదారి వెంట ఉన్న చెట్లు ప్రజలకు నీడనిచ్చి ఎంతో ఉపయోగపడ్డాయని గ్రామస్తులు గుర్తుచేశారు. ప్రజలకు ఉపయోగపడే చెట్లను అనుమతులు లేకుండా నరికివేయడం బాధాకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.