నందికొట్కూరు, సెప్టెంబర్ 18 (చైతన్యగళం): నందికొట్కూరు పట్టణంలో ఐదు రోజులుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వినాయక చవితి వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. నిమజ్జనంలో భాగంగా ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం వినాయక విగ్రహాలను భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు.

గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పటేల్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో సామాజిక సేవకుడు గుజ్జల గౌరీనాయుడు మాట్లాడుతూ.. ‘గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రావాలి గణనాథా’ అంటూ భక్తులు చేసిన నినాదాలతో పట్టణ పురవీధులు మారుమోగాయని తెలిపారు. మహిళలు, యువత, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను వినియోగించాలని సూచించారు.
కార్యక్రమంలో తహసీల్దార్, మేజిస్ట్రేట్ శ్రీనివాసులు, ప్రముఖ చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు, బండారు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.