CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 9:36 pm Posted by : rakeshkashaveni12@gmail.com

భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి – కలెక్టర్ చిత్రా మిశ్రా

చిగురుమామిడి, సెప్టెంబర్ 18(చైతన్యగళం):

భూముల రీసర్వేను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిగురుమామిడి మండలం ఉల్లంపల్లిలో కొనసాగుతున్న భూముల రీసర్వేను కరీంనగర్ ఆర్డీవో షర్మిలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే అధికారులతో మాట్లాడి రీసర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రీసర్వేతో భూములకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వే నిర్వహించే ముందు సంబంధిత రైతులకు తప్పనిసరిగా ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలోనే సర్వే చేయాలని ఆదేశించారు. సాంకేతిక పరికరాలతో సర్వే నిర్వహిస్తున్నందున భూముల హద్దుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో రెండు బృందాలు రీసర్వే నిర్వహిస్తున్నాయని, ఇప్పటివరకు 605 ఎకరాల భూమిని సర్వే చేసినట్లు తహసీల్దార్ కనకయ్య వివరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్ నర్సరీ ఏర్పాటుకు స్థలం పరిశీలన

చిగురుమామిడి మండలం ఉల్లంపల్లిలో ఆయిల్‌పామ్ నర్సరీ ఏర్పాటు చేసేందుకు ఓదెల మల్లన్న గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్డీవో షర్మిల, తహసీల్దార్ కనకయ్యను అడిగి స్థలానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ప్రోటోకాల్ పాటిస్తూ నిబంధనల మేరకు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.