CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 5:09 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రజాపాలనలో పారదర్శకతే లక్ష్యం

  • సామాజిక న్యాయం.. సమాన అవకాశాలే ప్రభుత్వ ధ్యేయం
  • ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 17 (చైతన్యగళం): ప్రజాపాలనలో పారదర్శకత, అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజల సంక్షేమం, జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సెప్టెంబరు 17ను పురస్కరించుకుని నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవానికి మంత్రి శ్రీధర్‌బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి:

సెప్టెంబరు 17 చారిత్రక ప్రాధాన్యమున్న రోజని మంత్రి పేర్కొన్నారు. నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు జరిగిన పరివర్తనను స్మరించుకుంటూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అనంతరం పలువురు అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కలెక్టర్ నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.