- ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
నాగర్కర్నూల్, సెప్టెంబరు 17 (చైతన్యగళం): తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్కర్నూల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో గురువారం జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
పతాకావిష్కరణకు ముందు తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించడం ద్వారా అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ మల్లు రవి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ కృషిని అభినందించారు.
తెలకపల్లి కేకే రెడ్డి ఉన్నత పాఠశాల, తూడుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెంట్లవెల్లి కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, అదనపు కలెక్టర్లు బి.చెన్నయ్య, దేవసహాయం, డీఆర్వో పాండు, ఏవో చంద్రశేఖర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.