ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 14 (చైతన్యగళం): శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి ఇంట్లో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చనలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని గణనాథుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని, వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సూచించారు.