CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 8:47 am Posted by : CHAITHANYA GALAM NEWS

పుట్టిన గడ్డపై మమకారం.. ప్రజాసేవపై సంకల్పం

  • ఆపదలో ఆపద్బాంధవుడిగా.. కల్వకుర్తి ప్రజలకు అండగా ఐక్యత ఫౌండేషన్‌
  • సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి సేవా దృక్పథం

కల్వకుర్తి, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): పదవిని ఆశించకుండా.. ప్రజల అవసరాన్ని గుర్తించి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వ్యక్తి సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి. రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతూనే ఐక్యత ఫౌండేషన్‌ ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో విస్తృత సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పేదల కష్టం తన కష్టంగా భావిస్తూ.. అవసరమైన వేళ అండగా నిలవాలన్న ఆలోచనతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

పుట్టిన గడ్డపై మమకారంతో..

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం చౌదర్‌పల్లిలో పుట్టి పెరిగిన రాఘవేందర్‌రెడ్డి అమెరికాలో వ్యాపార సంస్థలను స్థాపించి ఉన్నత స్థాయికి ఎదిగారు. అయితే పుట్టిన ఊరు, సొంత ప్రాంత ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపనతో స్వదేశానికి తిరిగివచ్చారు. 2023లో ఐక్యత ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడాన్ని తన బాధ్యతగా భావిస్తున్నారు.

ఆపదలో అండగా.. ఆరోగ్యానికి భరోసాగా..

అత్యవసర సమయాల్లో పేదలకు వైద్యసేవలు అందించేందుకు ఉచిత అంబులెన్స్‌ సేవను అందుబాటులోకి తీసుకువచ్చారు. వృద్ధులు, పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు చేయించారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఫిల్టర్‌ నీటి ట్యాంకులు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టారు.

యువత భవిష్యత్తే లక్ష్యంగా..

నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి మార్గనిర్దేశం చేస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించడం, ప్రజల సమస్యలకు సాధ్యమైన పరిష్కారం చూపడమే తన భవిష్యత్‌ కార్యాచరణగా చెబుతున్నారు.

ఆరు మండలాల సమగ్ర అభివృద్ధి..

కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రజలకు అవసరమైన సేవలను విస్తరించాలన్నది రాఘవేందర్‌రెడ్డి లక్ష్యంగా పేర్కొంటున్నారు. ఆరోగ్యం, తాగునీరు, ఉపాధి, విద్య, యువతకు అవకాశాలు వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని భావిస్తున్నారు.

పదవి కోసం కాదు.. ప్రజల కోసం అనే ఆలోచనతో ముందుకు సాగుతూ, ఐక్యత ఫౌండేషన్‌ను మరింత విస్తృత ప్రజాసేవా వేదికగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాఘవేందర్‌రెడ్డి పనిచేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రజల సమస్యలను వినడం.. సాధ్యమైనంత మేర పరిష్కరించడం.. అవసరమైన సమయంలో అండగా నిలవడం తన సేవా ప్రస్థానానికి పునాది అని ఆయన పేర్కొంటున్నారు.