CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 9:03 am Posted by : CHAITHANYA GALAM NEWS

అభివృద్ధే లక్ష్యం.. మౌలిక వసతులే ప్రాధాన్యం

  • 42వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం: యాదగిరి సునీల్‌రావు

కరీంనగర్, సెప్టెంబర్‌ 12 (చైతన్యగళం): నగర అభివృద్ధిలో భాగంగా 42వ డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. డివిజన్‌లోని కాశ్మీర్‌గడ్డ మునావర్‌ మసీదు వీధిలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పనులను పరిశీలించిన సునీల్‌రావు అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ సమయంలో స్థానికులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

గతంలో 42వ డివిజన్‌ సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రత్యేక గుర్తింపు పొందిందని, అదే తరహాలో కొత్తగా డివిజన్‌లో కలిసిన ప్రాంతాల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామని సునీల్‌రావు తెలిపారు. వివేకానంద పాఠశాల పరిసర ప్రాంతాల్లో త్వరలో అభివృద్ధి పనులు చేపట్టి స్థానిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.

జిల్లా పరిషత్‌ క్వార్టర్స్‌ వద్ద ఉన్న పార్కును త్వరలో అధునాతనంగా అభివృద్ధి చేసి ప్రజలకు పునరంకితం చేస్తామని వెల్లడించారు. డివిజన్‌ వ్యాప్తంగా రహదారులు, పార్కులు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ టి.చంద్రమౌళి, శ్రీధర్‌, అశోక్‌, వినోద్‌కుమార్‌, విజయభాస్కర్‌, ఖాదర్‌ ఫారుకి, ఇబ్రహీం, తబ్రేజ్‌, షారుక్‌, మహమ్మద్‌ ఆబిద్‌, డివిజన్‌ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.