- కలెక్టర్, సీపీ, ఇరిగేషన్ ఎస్ఈలకు మేయర్ కొలగాని శ్రీనివాస్ వినతి
కరీంనగర్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): గణేష్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా సరిపడా నీటిని విడుదల చేసి, అవసరమైన నీటిమట్టాన్ని కొనసాగించాలని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్లను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలకు లేఖలు రాసి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల గణేష్ విగ్రహాలను ప్రతి ఏడాది చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లోని ఎస్సారెస్పీ కాలువల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని మేయర్ తెలిపారు. ఈ ఏడాది వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున నిమజ్జన తేదీలకు అనుగుణంగా ముందుగానే నీటిని విడుదల చేయాలని కోరారు. కాలువల్లో నీటి మట్టం తక్కువగా ఉంటే నిమజ్జనానికి ఆటంకం కలగడంతో పాటు ప్రమాదాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
నిమజ్జన కేంద్రాల్లో రహదారుల మరమ్మతులు, గుంతల పూడ్చివేత, గ్రావెల్ ఏర్పాటు, విద్యుత్, ఫ్లడ్లైట్లు, తాగునీరు, పారిశుధ్యం, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, క్రేన్లు, బారికేడ్లు, గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, సమాచార బోర్డులు అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని, మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
ఇరిగేషన్, పోలీసు, నగరపాలక సంస్థ, విద్యుత్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా మండపాల నిర్వాహకులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పరం సహకరించాలని కోరారు.