CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 10:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అరవింద విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం):
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సుమారు అర్ధ శతాబ్ద కాలంగా విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న అరవింద విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా నిర్వహించారు. 1995–96 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు బస్టాండ్ రోడ్డులోని కిరాణా వర్తక సంఘం భవనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అరవింద విద్యాసంస్థల అధినేత ఎన్. చంద్రదేవ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరవింద విద్యాలయంలో విద్యనభ్యసించిన పలువురు విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత హోదాల్లో స్థిరపడటం అభినందనీయమన్నారు. పూర్వ విద్యార్థులు తమ విద్యాసంస్థతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. గౌరవ అతిథిగా హాజరైన రిటైర్డ్ లెక్చరర్, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి కూతురు సత్యనారాయణ మాట్లాడుతూ.. సృష్టిలో స్నేహాన్ని మించిన బంధం మరొకటి లేదన్నారు. పాఠశాల రోజుల స్నేహితులు ఏళ్ల తర్వాత ఒకచోట చేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యార్థి దశ నాటి జ్ఞాపకాలను, అనుభవాలను, ఆత్మీయ అనుబంధాలను పరస్పరం పంచుకున్నారు. అనంతరం అప్పట్లో విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు రఫీ, వెంకన్న, చరణ్, మహమ్మద్ గౌస్, నాగేందర్, రవీందర్, వెంకటేశ్వర్లు, సద్గుణచారి, పరశురాములను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని టి. నవీన్, డి. నరేష్, ఎం. సతీష్, వి. వినోద్, ఎల్. సంతు, జి. భాస్కర్ తదితర పూర్వ విద్యార్థులు నిర్వహించారు.