- ప్రజలకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపు
కరీంనగర్, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలు మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రామగుండం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో రూపొందించిన “మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే అవగాహన పోస్టర్ను కలెక్టర్ బుధవారం సాయంత్రం తన చాంబర్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణహిత గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ప్రజలు మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలని కోరారు.
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, పర్యావరణహితంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, హుజూరాబాద్ ఆర్డీఓ జలకుమారిలకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ బిక్షపతితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.