CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:15 pm Posted by : CHAITHANYA GALAM NEWS

చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి

  • ఉద్యోగుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం: జేఏసీ

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్‌ అధికారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

కరీంనగర్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో లోపాలను సరిదిద్దాలని, పెండింగ్‌ బకాయిలు, పీఆర్‌సీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

2004 సెప్టెంబర్‌ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి అమలవుతున్న సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. పెన్షన్‌ ఉద్యోగుల హక్కు, అది ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడేది కాదని స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్‌ అధికారులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సమావేశంలో జేఏసీ నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.