CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:08 pm Posted by : CHAITHANYA GALAM NEWS

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

  • కబడ్డీతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు: యాదగిరి సునీల్‌రావు

కరీంనగర్‌ టౌన్ (చైతన్యగళం): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్‌ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. క్రీడలను కాలక్షేపంగా కాకుండా లక్ష్యంతో ఆడాలని సూచించారు.

కరీంనగర్‌ పద్మనగర్‌లోని మానేరు సీబీఎస్‌ఈ పాఠశాలలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్‌ కరీంనగర్‌ అర్బన్‌ స్థాయి అండర్‌–14, 17 బాలబాలికల కబడ్డీ పోటీలు–2026–27 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్బన్‌ పరిధిలోని సుమారు 70 పాఠశాలల నుంచి 2,500 మందికి పైగా విద్యార్థులు పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన కబడ్డీకి నేడు ప్రో కబడ్డీ ద్వారా మంచి ఆదరణతో పాటు క్రీడాకారులకు ఆర్థిక అవకాశాలు, అంతర్జాతీయ గుర్తింపు లభిస్తున్నాయని తెలిపారు. ఓటమిని గెలుపునకు పునాదిగా భావించి లోపాలను సరిదిద్దుకుంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల చైర్మన్‌ అనంతరెడ్డి, ఎస్‌ఆర్‌ఆర్‌ రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ జి. మధుసూదన్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ మాజీ కార్యదర్శి వేణుగోపాల్‌, పీపీటీఏ శ్రీధర్‌గౌడ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.